అమరావతి: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చెప్పారు
ఆదివారం అమరావతిలో ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన కీలక అంశాలు

నిల్వలు పుష్కలంగా ఉన్నాయి: రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ అవసరాలకు మించి పెట్రోల్ (4.4%), డీజిల్ (9%) నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు భయాందోళనతో బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదు.
పుకార్ల వల్లే సమస్య:
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారం వల్ల వాహనదారులు ఒక్కసారిగా ‘ఫుల్ ట్యాంక్‘ చేయించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో కొన్ని చోట్ల తాత్కాలిక రద్దీ ఏర్పడింది.

బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం: ఇంధన కొరత పేరుతో కృత్రిమ కొరత సృష్టించే వారిపై, అలాగే బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు గ్యాస్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేసి, వేల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీస్ నిఘా: బంకుల వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని, ఎవరైనా తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు వాస్తవాలను గ్రహించాలని, కేవలం అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.















